
చతిస్గడ్, 24 ఫిబ్రవరి (హి.స.)
సేఫ్ సరెండర్ కోరుతూ బలంగిర్-బరఢ్-మహాసముంద్ డివిజన్ (బీబీఎం)కు చెందిన మావోయిస్టుల లేఖపై ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు. లొంగిపోయే మావోయిస్టుల భద్రత విషయంలో ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్- ఒడిశా బోర్డర్లో యాక్టివ్గా ఉండే బీబీఎం డివిజన్కు చెందిన 15 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మావోయిస్టు పార్టీ పశ్చిమ సబ్ జోనల్ సెక్రెటరీ వికాస్ పేరిట ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి లేఖ అందింది. లొంగిపోయిన తమ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదంటూ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రేడియోలో సందేశం ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. రేడియో సందేశం బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత మార్చి 2 లేదా 3వ తేదీన సభ్యులు రహస్య స్థావరాల నుంచి బయటకొచ్చి లొంగిపోతారని ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ లేఖపై స్పందించిన విజయ్ శర్మ మీరు రాసిన లేఖ మాకు అందిందని ధ్రృవీకరించారు.
ఆలస్యం కాకుండా చూసుకోండి:
లొంగిపోవడం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా వికాస్ ను కోరుతున్నాను. లేఖలో పేర్కొన్నట్లు డీబీసీ ముగ్గురు సభ్యులు, ఏరియా కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు, అలాగే పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు మొత్తం పద్నాలుగు మంది బస్తర్కు చెందినవారు, ఒకరు తెలంగాణకు చెందినవారు అందరూ లొంగిపోండి. మావోయిస్టులలో బస్తర్ వారైనా, తెలంగాణ వారైనా మా దృష్టిలో అందరూ సమానమే అని చెప్పారు. మీరు తప్పకుండా అజ్ఞాతం వీడి బయటకు వచ్చేయండి. మీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకురండి. ఇంకా ఎక్కడైనా డంప్ చేసిన ఆయుధాలు ఉంటే వాటి గురించి సమాచారం ఇస్తే వాటిని కూడా క్లియర్ చేసుకుంటాంమన్నారు. మార్చి 2, 3 తేదీలకు మించి ఆలస్యం కాకుండా చూసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు