
చిక్కబళ్లాపుర, 01 మార్చి (హి.స.)అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని ఓ గ్రామం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు నలభై ఏళ్ల కిందట ఖమేనీ ఆ గ్రామంలో పర్యటించడమే ఇందుకు కారణం.
చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపుర జనాభా దాదాపు 30 వేలు. వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలు. దీన్ని ‘మినీ ఇరాన్’గా అభివర్ణిస్తుంటారు. 1986లో ఖమేనీ భారత్లో పర్యటించగా.. ఆ సందర్భంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన అలీపురను (Khamenei visited Alipura) సందర్శించారు. స్థానిక ప్రజలతోపాటు మత పెద్దలతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థంగా స్థానికంగా ఓ ఆసుపత్రిని నిర్మించారు. ఇలా ఇరాన్తో ఈ గ్రామానికి బలమైన సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. అనేక కుటుంబాలు ఉన్నత చదువుల కోసం ఇరాన్ వెళ్లడంతోపాటు కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ