
అమరావతి, 14 మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీ పరిధిలోని నందిగరువు ఆదివాసి గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో పాడేరు చేరుకోనున్న పవన్ కళ్యాణ్, ఓనూరు జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం ‘అడవి తల్లికి బాట’ పేరిట నిర్మించిన రహదారిని ప్రారంభించనున్నారు. తదుపరి గ్రామసభలో పాల్గొని గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ