
కేరళం, 22 మార్చి (హి.స.)
కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి
వ్యాప్తి కలకలం రేపుతోంది. కోళికోడ్ జిల్లాలో షిగెల్లా (Shigella) వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళికోడ్ జిల్లాలోని ఎరంజికల్ ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఈ వ్యాధి బారిన పడిన నలుగురిలో ఒక చిన్నారి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విశ్లేషణ ప్రకారం.. కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు ఇప్పటికే బాధితులైన కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఎరంజికల్ ప్రాంతంలో వ్యక్తి నుండి వ్యక్తికి వేగంగా సంక్రమిస్తోందని అధికారులు భావిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు గ్రామపంచాయతీ యంత్రాంగం, ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగి, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి.
షిగెల్లా అనేది ఒక రకమైన బాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. దీనినే షిగెల్లోసిస్ అని కూడా పిలుస్తారు. షిగెల్లోసిస్ ఒక తీవ్రమైన ప్రేగు సంబంధిత అంటువ్యాధి. రక్తం, చీముతో కూడిన విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం దీని లక్షణాలు. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం ద్వారా ఇది శరీరంలోకి చేరుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని తాకడం, వారు ఉపయోగించిన వస్తువులను వాడటం ద్వారా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా సోకవచ్చు, కానీ 5 ఏళ్లలోపు పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. షిగెల్లా వ్యాప్తిని అరికట్టడానికి పరిశుభ్రత ఒక్కటే మార్గం. ఆహారం తినే ముందు చేతులను సబ్బుతో
శుభ్రంగా కడుక్కోవడం అత్యంత ముఖ్యం. అలాగే, నీటిని బాగా మరిగించి చల్లార్చుకుని తాగడం, కలుషితమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..