
అమరావతి, 23 మార్చి (హి.స.)
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్నిర్వహిస్తున్న 'ప్రజాదర్బార్' 84వ రోజుకు చేరుకుంది. ఈరోజు(సోమవారం) విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను నిశితంగా పరిశీలించి.. త్వరలోనే పరిష్కరిస్తానని లోకేశ్ భరోసా కల్పించారు.
ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని పరిష్కరించే లక్ష్యంతో 'ప్రజాదర్బార్' కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఈరోజు పలు కీలక వినతులను వివిధ వర్గాల ప్రజలు మంత్రి లోకేశ్కు అందజేశారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగుల విన్నపం..
ఆంధ్రా యూనివర్సిటీ (AU)లో మినిమం టైమ్ స్కేల్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు మంత్రి లోకేశ్ని కలిశారు. తమ పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని వారు కోరారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న విధంగానే తమకు కూడా ఈ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ శాఖలో పోస్టుల గురించి..
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై పలువురు అభ్యర్థులు స్పందించారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), JLM (జూనియర్ లైన్మెన్) పోస్టులను కూడా ఈ క్యాలెండర్లో చేర్చి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రిని కోరారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ పోర్టర్ల అభ్యర్థన..
విశాఖపట్నం ఎయిర్పోర్టులో పనిచేస్తున్న పోర్టర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ సేవలను ఉపయోగించుకోవాలని, తమకు ఉపాధి కల్పించాలని మంత్రి లోకేశ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయా సమస్యలను అధికారులు పరిశీలించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ భరోసా కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ