
ఢిల్లీ, 23మార్చి (హి.స.) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఈ వారాన్ని కూడా మార్కెట్లు (Stock Market) భారీ నష్టాలతో ప్రారంభించాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 23వేల మార్క్ను కోల్పోయింది.
ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1855.20 పాయింట్లు దిగజారి 72,677.68 వద్ద, నిఫ్టీ 591.7 పాయింట్లు పతనమై 22,522 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో నేటి సెషన్లో ఇప్పటివరకు దాదాపు రూ.11లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహ రంగ సూచీలు 2శాతం మేర కుంగాయి.
రూపాయి ఢమాల్..
మరోవైపు, రూపాయి (Rupee Value) విలువ దారుణంగా పతనమవుతోంది. నేటి ట్రేడింగ్లో 33 పైసలు క్షీణించి 93.86 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.
మార్కెట్ పతనానికి కారణాలివే..
గంటకు రూ.1000కోట్ల అమ్మకాలు: ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20వ తేదీ వరకు 16 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ మదుపర్లు దాదాపు రూ.లక్ష కోట్ల విక్రయాలు చేపట్టారు. అంటే ఒక ట్రేడింగ్ అవర్కు దాదాపు రూ.1000కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి విలువ పతనం వంటి కారణాలతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ