
కంకిపాడు, 23 మార్చి (హి.స.)విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో నగదు చోరీతోపాటు అవకతవకలపై విచారణ చేస్తున్నామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. దీనిపై విచారణ పూర్తిచేసి 15 రోజుల్లో కమిషనర్కు నివేదిక అందజేస్తామన్నారు. గత ఐదేళ్లకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలిస్తామని చెప్పారు. ఆలయ ఈఓ భవానీ, అర్చకులు కలిసి రూ.10 లక్షలకుపైగా నగదు మాయం చేసినట్లు వస్తోన్న ఆరోపణలపై అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు.
ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగులు పూర్ణ రోశయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆలయ ఈఓ భవాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది. దేవాలయంలోని అంతరాలయం హుండీ తాళానికి మరో తాళంచెవి తయారు చేయించుకుని.. దాని సాయంతో ఈ నగదు చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఈ చోరీకి సంబంధిత సొమ్ము పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ.. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ.. ఆలయ ఉద్యోగులు, అర్చకులను విచారించనుంది. అలాగే ఆలయంలోని రికార్డులనూ పరిశీలించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్