కోర్టు ధిక్కరణను ఉపేక్షించేది లేదు.. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం
పెండింగ్లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
Highcourt


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. నేడు (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో హైకోర్టు ఆదేశించింది.

నేడు కోర్టుకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ.. ‘ఈరోజు అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటాము. వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు. ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాము’..

‘కోర్టు ధిక్కరణ కింద నోటిసులు ఇచ్చి ఆరు నెలలు అయింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కదా ?. ముందే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కోర్టు ధిక్కరణ అంశాలను ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande