
న్యూఢిల్లీ, 30 మార్చి (హి.స.)
మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో దేశంలో
ఇంధన కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల భారతదేశానికి అందాల్సిన LPG దిగుమతులు దాదాపు 50 శాతం మేర పడిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశీయంగా వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా పెట్రోలియం భద్రతా మరియు లైసెన్సింగ్ నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తూ కేంద్రం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గతంలో నిలిపివేసిన పి.డి.ఎస్ (PDS) కిరోసిన్ పంపిణీని 300 పునరుద్ధరించడమే కాకుండా, దానిని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ నూతన విధానం ప్రకారం.. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సడలింపులు వర్తిస్తాయి. సాధారణంగా రేషన్ షాపులకే పరిమితమయ్యే కిరోసిన్, ఇప్పుడు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో కూడా లభ్యం కానుంది. గ్యాస్ సిలిండర్ల కొరత భయాల నేపథ్యంలో తక్కువ ఆదాయ వర్గాలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు కిరోసిన్ను ఒక ప్రత్యామ్నాయ ఇంధనంగా అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ తాత్కాలిక ఏర్పాటు సుమారు 60 రోజుల పాటు అమలులో ఉంటుంది.
దీనికోసం ప్రభుత్వం అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ ను కేటాయించింది. గృహ అవసరాలకు కిరోసిన్ను వాడుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా వంటింట్లో గ్యాస్ వినియోగంపై ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కాలుష్య కారకమైన కిరోసిన్ వాడకాన్ని తగ్గించి, పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)
వైపు ప్రజలను మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులను ఆదుకోవడమే ప్రధమ కర్తవ్యంగా ప్రభుతం ఈ చర్యలు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు