
ఢిల్లీ, 07మార్చి (హి.స.) రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ఆరోపించారు. పలు వివాదాల నడుమ ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) సినిమాపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదన్నారు. నిజమైన కేరళ సంస్కృతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని అన్నారు. సమాజంలో విద్వేషాలు పెంచడానికి, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలను, మీడియాను ఆయుధంలా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఇలాంటి విషయాలను బహిరంగంగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారని.. మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. తాను కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని తెలిపారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భాజపా ఎంపీ మనోజ్ తివారి భార్య సురభి తివారీ తప్పుబట్టారు. ఇంట్లో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడడం సరైన చర్య కాదని అన్నారు. థియేటర్కు వెళ్లి సినిమా చూశాక, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తర్వాత అది నిజమో కాదో ప్రజలే తెలుసుకుంటారని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు