ప్రేమ పేరుతో మతమార్పిడుల దందా
హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని మతం మార్చే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు
ప్రేమ పేరుతో మతమార్పిడుల దందా


హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక దారుణమైన వంచన ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో వల వేయడం, ఆపై మతం మార్చుకోవాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జమీర్, అతని తమ్ముడు మిరాజ్ కలిసి ఒక పక్కా ప్రణాళికతో అమాయక యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇప్పటివరకు సుమారు ఐదుగురు హిందూ యువతులను ప్రేమ పేరుతో నమ్మించి, వారి జీవితాలతో ఆడుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

నిందితుల్లో ఒకరైన జమీర్పై గతంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదై ఉండటం గమనార్హం. ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చినా, అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు గుర్తించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జమీర్ తన తమ్ముడు మిరాజ్తో కలిసి ఈ అరాచకాలను మరింత ముమ్మరం చేశాడు. తాజాగా మరో యువతిని తన ప్రేమ వలలో వేసుకున్న జమీర్, ఆమెను లొంగదీసుకున్న తర్వాత అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. సదరు యువతిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, ఆమెను తమ మతంలోకి మారాలని బలవంతం చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాడు. ఒకవేళ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ అన్నదమ్ములిద్దరూ కలిసి బాధితురాలిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు సమాచారం.

బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ అన్నదమ్ముల గుట్టు రట్టయింది. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అన్నదమ్ములు కేవలం ఇద్దరే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారా లేక వీరి వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, నిందితుల నుంచి ప్రాణహాని ఉన్న యువతులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగర నడిబొడ్డున మతం మార్పిడి లక్ష్యంగా జరుగుతున్న ఇటువంటి దాడులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande