
చిత్రదుర్గ, 29 ఏప్రిల్ (హి.స.)
: జనసేన పార్టీ కర్ణాటక రాష్ట్రంలో తన విస్తరణకు శ్రీకారం చుట్టింది. చిత్రదుర్గ జిల్లా వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. దాదాపు 200 మందికి పైగా అధికారికంగా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగబాబు, తాళ్లూరి రామ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కర్ణాటకలో జనసేన పార్టీ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ, వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. కొత్త తరహా నాయకత్వాన్ని ప్రోత్సహించడం పార్టీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. జనసేన ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రజల కోసం పని చేసే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ సిద్ధాంతమని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, పార్టీ భావజాలానికి అనుగుణంగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కర్ణాటక రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని అక్కడి నాయకులు, ప్రజలు కొంతకాలంగా విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్రదుర్గ జిల్లాలో ఈ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో జనసేన పార్టీ విస్తరణకు ఇది తొలి పెద్ద అడుగుగా భావిస్తున్న నాయకులు, రానున్న రోజుల్లో మరింత బలోపేతం దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ