
షిల్లాంగ్, 29 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్యకేసు కీలక మలుపు తిరిగింది. నిందితురాలు సోనమ్కు బెయిల్ మంజూరు చేస్తూ షిల్లాంగ్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, పోలీసులు సోనమ్ను అరెస్టు చేసే సమయంలో పత్రాల తయారీలో జరిగిన లోపం వల్లే బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సోనమ్కు బెయిల్ ఇవ్వడాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మేఘాలయా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. అలాగే, ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
సోనమ్కు బెయిల్ ముంజూరు చేయడంపై రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మండిపడ్డారు. షిల్లాంగ్ పోలీసులు ఈ కేసును మొదటి నుంచి సరిగ్గా దర్యాప్తు చేయడంలేదు. నిందితులు దానిని అవకాశంగా తీసుకున్నారు. ఈ కేసులో నిందితురాలు సోనమ్కు ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఈ కేసులో సోనమ్ తేలికగా తప్పించుకుంటే, రాబోయే రోజుల్లో హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతో మంది మహిళలు కూడా దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుని తప్పించుకుంటారు. ఆ పనిని నేను ఎప్పటికీ జరగనివ్వను. సోనమ్కు ఇతర నిందితుల వలే అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తాను. ఇందుకోసం నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఈ మొత్తం విషయంపై సీబీఐ విచారణకు ఆదేశించి, నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని నేను ప్రధానమంత్రిని, హోంమంత్రిని డిమాండ్ చేస్తున్నాను.గోవింద్, సోనమ్ కుటుంబం మొదటి నుంచి ఆమెకు సహాయం చేస్తున్నారు. అందుకే సోనమ్కు బెయిల్ వచ్చింది. అంతా డబ్బుతోనే జరుగుతోంది. ఆ కుటుంబాన్ని నేను ఎప్పటికీ క్షమించను అని రాజా తల్లి పేర్కొన్నారు.
సోనమ్కు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. రూ. 50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన మీదట కోర్టు సోనమ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ సంబంధించి కోర్టు పలు కీలక సూచనలు చేసింది. బెయిల్ కాలంలో ఆమె షిల్లాంగ్ కోర్టు పరిధిని దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆమె ఆ పరిధిని దాటి ప్రయాణించాల్సి వస్తే, ఆమె షిల్లాంగ్ కోర్టుకు తెలియజేసి, ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. ఈ కేసులోని సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి సోనమ్ రఘువంశీ ప్రయత్నించకూడదని కూడా కోర్టు ఆదేశించింది.
మరోవైపు, సోనమ్ బెయిల్పై ఆమె సోదరుడు గోవింద్ రఘువంశీ ఈటీవీ భారత్తో మాట్లాడారు. సోనమ్కు బెయిల్ లభించింది నిజమే, కానీ ఆ అధికారిక ఉత్తర్వులు అందిన తర్వాతే నేను దీనిపై మరింత స్పష్టంగా మాట్లాడగలను. నేను సోనమ్కు ఎటువంటి వ్యక్తిగత సహాయం అందించలేదు. ఏ వ్యక్తికైనా లభించే సాధారణ న్యాయ సహాయాన్ని మాత్రమే ఆమె పొందింది. గత కొన్ని రోజులుగా రాజా రఘువంశీ కుటుంబం నాపై ఆరోపణలు చేస్తున్న తీరును బట్టి చూస్తే, ఇకపై నేను వారికి ఎటువంటి సహాయం చేయను. ఒకవేళ సోనమ్ ఇండోర్కు తిరిగి వస్తే, నేను ఇకపై ఆమెతో కలిసి నివసించను. ఆమె తన దారి తాను చూసుకోవచ్చు అని ఆమె సోదరుడు పేర్కొన్నారు.
కాగా, మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ తన భార్య సోనమ్తో కలిసి గతేడాది మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. మే 23న హనీమూన్ సమయంలో రఘువంశీ అదృశ్యమయ్యాడు. అనంతరం, మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక జలపాతం సమీపంలోని లోయలో జూన్ 2న అతని మృతదేహం లభ్యమైంది. అయితే, ఈ కేసులో సోనమ్తో పాటు ఆమె ప్రియుడితో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi