
న్యూఢిల్లీ: 09 ఏప్రిల్ (హి.స.)
పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తున్న రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (GIC) వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తానే స్వయంగా రూపొందించి, ప్రచురించిన వృక్ష వేదం పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు.
పర్యావరణ స్పృహ - వేదాల స్ఫూర్తి:
వేదాలలో వృక్షాల ప్రాముఖ్యత, ప్రకృతితో మానవ సంబంధం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసే అరుదైన శ్లోకాలు, విశేషాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా, అడవులు మరియు ప్రకృతి అందాలను ప్రతిబింబించే అద్భుతమైన ఛాయాచిత్రాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
ప్రశంసించిన రాష్ట్రపతి:
సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమం గురించి రాష్ట్రపతికి వివరించగా, ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కోట్లాది మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు చేస్తున్న కృషిని అభినందించారు. ముర్ము గారు మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించడం, చెట్లను నాటడం తనకు ఎంతో ఇష్టమైన పనులని, వచ్చేసారి హైదరాబాద్ పర్యటనలో తప్పకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi