
నిర్మల్, 01 మే (హి.స.)
అభివృద్ధి కి కార్మికులే చోదక శక్తి
అని నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ కార్మికులు అందరూ తమ తమ వృత్తులకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించుకోవడం వల్ల, ఉన్నతి సాధించగలుగుతారని వివరించారు. ప్రతి ఒక్కరూ కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులకు, ప్రభుత్వాలు అమలుపరుస్తున్న పథకాలు పొందాలని చెప్పారు. నైపుణ్యాలు ఉన్న కార్మికులకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని.. కార్మికులు తదనుగుణంగా ఆలోచన చేసి అవకాశాలు అందిపుచ్చుకోవాలని వివరించారు.
ప్రభుత్వాలు కూడా కార్మికుల్లో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణలు ఇస్తున్నాయని, కార్మికులు వాటిని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ అచీవ్మెంట్స్, ఆక్టివిటీస్ బుక్ లెట్ ఆవిష్కరించారు. పలువురు కార్మికులకు జ్ఞాపికలు అందించి, శాలువాలతో సత్కరించారు. అనంతరం అధికారులు, కార్మికులు కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు