
అమరావతి, 13 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని నేడు హైదరాబాద్ నుంచి మంగళగిరికి రానున్నారు. గత మూడు వారాలుగా హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాలకు హాజరుకానుండటంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు ప్రయాణం కానున్నారు. ఇక, ఉదయం 10:40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న డిప్యూటీ సీఎం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
కాగా, శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్.. మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన రాక సందర్భంగా గన్నవరం నుంచి మంగళగిరి వరకు జనసేన నాయకులు, అభిమానులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. స్వయంగా పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి.. పవన్ను పరామర్శించిన విషయం విదితమే..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ