
అమరావతి, 14 మే (హిం.స)
ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి లోకేశ్ తెలిపారు. గడచిన 23 నెలల్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇవి సాకారమైతే యువతకు 24 లక్ష ల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ), ఏపీ ఎంఎ్సఎంఈ డెవల్పమెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా బుధవా రం విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఐపీవో అవగాహన సదస్సులో లోకేశ్ ప్రసంగించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే ఏకైక ఎజెండాతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాలను ఏవిధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు టీమ్వర్క్తో పని చేస్తున్నామని చెప్పారు. లోకేశ్ ఏం చెప్పారంటే..
గూగుల్ సెంటర్లు.. ఎకోసిస్టమ్: చంద్రబాబు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లాగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలూ వస్తున్నాయి. పుట్టపర్తిలో ప్రపంచ శ్రేణి ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్-ఫ్లయిట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్ రాగా.. త్వరలో ఇంకో సంస్థ భారీ పెట్టుబడులతో వస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే సీమకు క్యారియర్ కంపెనీ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీస్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటారు. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా నేను మెసేజ్ దూరంలోనే ఉంటా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ