
అమరావతి, 14 మే (హి.స.)
నేడు అమరావతిలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, భూ కేటాయింపులు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
ఈ సమావేశంలో 17వ ఎస్ఐపీబీ (State Investment Promotion Board) ఆమోదించిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నంలో రూ.1 లక్ష కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల రంగంలో విశాఖకు మరింత ప్రాధాన్యం పెరగనుంది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది.
కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ సంస్థ చేపట్టనున్న రూ.12 వేల కోట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం కలగనుంది. మరోవైపు తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్ తయారీ పరిశ్రమ స్థాపనకు కూడా కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక పలు కీలక సంస్థలకు భూ కేటాయింపుల అంశాలు కూడా కేబినెట్ ఎజెండాలో ఉన్నాయని సమాచారం. పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన పొదుపు చర్యల సూచనలపై కూడా కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రభుత్వ వ్యయ నియంత్రణ, వనరుల సమర్థ వినియోగంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్లు, భద్రతా సిబ్బంది వినియోగంలో జాగ్రత్తలు పాటించేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా ప్రజలకు కూడా సీఎం కీలక సూచనలు చేసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో పొదుపు చర్యల అవసరాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ