
న్యూఢిల్లీ, 15 మే (హి.స.)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 2017లో
సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధాన దోషి, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు పడిన జీవితఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును మళ్లీ విచారించాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. రెండు నెలల కాలపరిమితిలోగా ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సుప్రీంకోర్టు నిర్ణయంతో సంబంధం లేకుండా తాజా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు దిశానిర్దేశం చేసింది.
కాగా, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్కు 2019లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షను సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కొన్ని కారణాల రీత్యా శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు