
ఖమ్మం, 18 మే (హి.స.)
వరదల సమయంలో అధికారులసూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని, విపత్తుల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని మాన్సూన్ సీజన్కు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు చేపట్టిన ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మున్నేరు పరీవాహక ప్రాంతంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్.డి.ఎం.ఏ) మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన వరద ప్రమాదాల మాక్ ఎక్సర్సైజ్ ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ వరదల వంటి విపత్తుల సమయంలో అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేస్తే ప్రాణనష్టం నివారించవచ్చని అన్నారు. సాధారణంగా ప్రజలు నీరు కళ్లకు కనిపించే వరకు ఇళ్లను ఖాళీ చేయరని, ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు అధికారికంగా ఎవాక్యుయేషన్ సూచనలు ఇచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని సూచించారు.
వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి సమాచారం అందిన వెంటనే వివిధ శాఖలు ఏ విధంగా స్పందించాలి, ప్రజలను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, రెస్క్యూ బృందాలు ఎలా పనిచేయాలి, రిలీఫ్ క్యాంపులను ఎలా నిర్వహించాలి వంటి అంశాల పై స్టెప్ బై స్టెప్ విధానంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వరదల సమయంలో ప్రజలు ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆధార్ కార్డు, రేషన్
కార్డు, బ్యాంక్ పాస్బుక్లు, భూ పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ జిప్ బ్యాగ్లలో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు