
తిరుపతి,18 మే (హి.స.) తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపును చూసి అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఆదివారం రాత్రి వేళ కావడంతో ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ సాధారణంగానే ఉంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
ఏనుగుల గుంపు కారణంగా ఘాట్ రోడ్డులో సుమారు అరగంట పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టార్చ్లైట్లు వేస్తూ.. సైరన్లు మోగించడంతో ఏనుగుల గుంపు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV