
హైదరాబాద్, 29 మే (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోభాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నేడు నోటీసులు జారీ చేశారు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. తదనంతరం మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా కేసు వేగం పుంజుకుంది. ప్రస్తుతం విచారణ వేగవంతం కాగా, జూన్ 1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..