
హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడు పోయే పార్టీగా తయారైందని డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారంటూ సొంత పార్టీపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసినట్లుగా వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్ అయింది. ఇందులో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. షబ్బీర్ అలీతో వివాదం విషయంలో గతంలోనే చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పీసీసీ తాజాగా షబ్బీర్ అలీకి సైతం నోటీసులు జారీ చేసింది. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ ఆరోపణల పై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. నా ఆస్తులు, నా వ్యక్తిత్వం నేను ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు అన్నారు.చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ సీఎం సమక్షంలో చేర్పించారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరం అని వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఏడాది కిందట మాట్లాడినదన్నారు. ఆ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. కాగా మహేశ్ కుమార్ గౌడ్ కు షబ్బీర్ అలీకి మధ్య విభేదాలు తలెత్తాయని దీంతో ఈ వ్యవహారం ఎటువైపు మళ్లబోతోంది అనేది ఆసక్తిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు