
హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక వంటివారని అన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమకు కేటాయించిన హ్యాండ్బుక్లోని నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో ఓటర్లకు అండగా నిలవాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi