రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -కప్పట్రాళ్ల బొజ్జమ్మ
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -కప్పట్రాళ్ల బొజ్జమ్మ
కప్పట్రాళ్ల బొజ్జమ్మ


దేవనకొండ, 21 జూన్ (హి.స.): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ అన్నారు. దేవనకొండలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా బొజ్జమ్మ మాట్లాడుతూ, రైతు కష్టాన్ని గుర్తించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక సాగు విధానాలను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించే చర్యలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande