
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకై సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మెట్రో రైలు స్వాధీనం, సెకండ్ ఫేజ్ విస్తరణకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నిన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఆయన నివాసంలోనే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ, IRFC రుణం, తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్ -2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI క్యాప్స్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని.. సీఎం, కేంద్రమంత్రులు నిర్ణయించారు. ఇందులో సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికారి, రాష్ట్ర MAUD స్పెషల్ సెక్రటరీ ఉండనున్నారు.
మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత?, ప్రభుత్వం దానిని ఎలా టేకోవర్ చేసుకోవాలి? ఫేజ్-2 విస్తరణకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి తక్కువ వడ్డీకి రుణం ఎలా పొందాలి? అనే విషయాలపై ఎస్బీఐ క్యాప్స్ సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MoHUA) తదుపరి నిధుల విడుదలకు క్లియరెన్స్ ఇవ్వనుంది. ఈ చర్చల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో దశ మెట్రో విస్తరణ ప్లాన్లో దాదాపు 70 కిలోమీటర్ల పైగా కొత్త మార్గాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..