
బుక్కరాయసముద్రం(అనంతపురం), 24 జూన్ (హి.స.): ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పగటి ఉష్ణోగ్రతలు 36.2 నుంచి 36.8 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీయొచ్చన్నారు.
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలని రేకలకుంట ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త విజయశంకర్ బాబు సూచించారు. వర్షాధారంగా సాగుచేసే ఖరీఫ్ పంటకు అనుకూలంగా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకోవాలన్నారు. అధిక దిగుబడినిచ్చే వేరుశనగ రకాలైన కదిరి-6 కదిరి-9, కదిరి హరితాంధ్ర, అనంత, గ్రీష్మా, నారాయణి, ధరణిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. విత్తే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి ఇమిడా క్రోప్రిడ్ 600 ఎఫ్ యస్-2 మి.లీ -4 మి.లీ నీరు కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత టెబుకొనజోల్ 1.0 గ్రాములు గానీ,
మాంకోజెబ్ 3.0 గ్రాములుగానీ, ట్రైకొడెర్మవిరిడి 8 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలని సూచించారు. వేరుశనగ పొలం చుట్టూ రక్షణ పంటలుగా సజ్జ, జొన్న 4 నుంచి 6 వరుసలు విత్తుకోవాలన్నారు. తద్వారా కాండం కుళ్లు వైరస్నువ్యాప్తి చేసే తామరపురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. వేరుశనగలో కంది పంటను 8:1,11:1, 15:1 నిష్పత్తితో అంతర పంట సాగు చేసుకోవచ్చుని సూచించారు. రైతులు సంప్రదాయ పద్ధతిలో నాగలితో కన్నా.. అనంత విత్తన గొర్రు ఉపయోగిస్తే తక్కువ సమయంలో ఎక్కువ విత్తనం వేయవచ్చన్నారు. జూలై 31వ తేదీ వరకు కంది పంట వేసుకోవచ్చన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV