
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు
ప్రమాదం జరిగింది. ఏఎంబీ ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట వైపు బుల్లెట్ బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్పేట నుంచి గచ్చిబౌలి వైపు ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లో స్కూటీపై శ్రీకాంత్, విఠల్ వచ్చారు. ఈ క్రమంలో స్కూటీ, బుల్లెట్ బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీకాంత్, విఠల్ ఇద్దరూ ఎగిరిపడ్డారు. వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో వారి తలలు రోడ్డుకు బలంగా తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..