
న్యూఢిల్లీ, 01 జూలై (హి.స.)
రికార్డు స్థాయిలో జీఎస్టి వసూళ్లతో దేశీయ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి జోరు కొనసాగుతోంది. జూన్ 2026 నెలకు సంబంధించిన వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో దేశవ్యాప్తంగా రూ. 1,94,812 కోట్ల జీఎస్టి వసూలైంది. గత ఏడాది (జూన్ 2025) నమోదైన రూ. 1,71,105 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 13.9 శాతం వార్షిక వృద్ధిని (YoY) నమోదు చేయడం విశేషం. దేశంలో వ్యాపారాల డిజిటలైజేషన్, మెరుగైన పన్నుల పర్యవేక్షణ, పండుగల సీజన్ డిమాండ్, వినియోగం భారీగా పెరగడం వల్లే ఈ స్థాయిలో పన్ను వసూళ్లు సాధ్యమయ్యాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్థిరంగా రూ. 1.90 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదు కావడం దేశ ఆర్థిక సుస్థిరతకు అద్దం పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..