
హైదరాబాద్, 16 జూలై
(హి.స.)
వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఆ పార్టీ
పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు
అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేసిన జగన్... ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉభయ సభల్లో గళం విప్పాలని పిలుపునిచ్చారు. మహిళా
రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పోటీ పరీక్షలు నిర్వహించకుండానే డీఎస్పీ పోస్టులను భర్తీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే
ఒక పెద్ద స్కామ్ అని ఆరోపించారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్రమైన అవకతవకలు
జరిగాయని విమర్శించారు. తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ప్రత్యేకంగా జీవోలు
తెచ్చి... ఆ పని పూర్తికాగానే జీవోలను రద్దు చేశారన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్లు
సైతం వారి చేతుల్లోనే ఉన్నాయని, సాఫ్ట్బాల్
అసోసియేషన్ ప్రెసిడెంట్ గా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘానికి నారా లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడిగా
ఉన్నారని విమర్శించారు.
రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములను
ఇష్టారాజ్యంగా దోచిపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణంలో
చదరపు అడుగుకు రూ. 20,000 పైనే ఖర్చు
చూపిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా దోపిడీ చేస్తున్నారని, భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు ఒప్పుకోని రైతుల భూములను బలవంతంగా
లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 5,000 కోట్ల విలువతో నిర్మితమైన రామాయపట్నం పోర్టును కేవలం రూ. 1,500 కోట్లకే ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం పెద్ద కుంభకోణం కాదా? ఇలాంటి ఆదాయ వనరులను ప్రైవేటుకు ఇస్తే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి
నుంచి వస్తుంది? అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంలో
సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం చట్టం
పరిమితులను సైతం ఉల్లంఘించి గత రెండేళ్లలోనే రూ. 3.6 లక్షల కోట్ల భారీ అప్పులు చేశారని ఆరోపించారు. ఇంత అప్పు తెచ్చినా...
ప్రజలకు, రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యమని
విమర్శించారు. ఇసుక, మైన్స్, లిక్కర్
ఇలా ప్రతి రంగంలోనూ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi