
ఖమ్మం, 02 జూలై (హి.స.)
రైతులు ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలని, సాగులో భాగంగా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ కోసం పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర ఐఏఎస్ తెలిపారు. గురువారం ఏన్కూరు మండలం గార్లఓడ్డు గ్రామంలోని కట్టా హరినాథ్ బాబు ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి రైతు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం మొక్కలు, నిర్వహణ, అంతర పంట వేసుకోవడానికి రాయితీ నాలుగేళ్ల పాటు కల్పిస్తూ డ్రిప్ సౌకర్యం కూడా ఇవ్వడం రైతుకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతు వారి అనుభవాన్ని తెలియజేస్తూ, ఎకరానికి ఖర్చు పోను రూ.80,000 నికర ఆదాయం వచ్చిందని, తనకున్న 10 ఎకరాల్లో 8 లక్షల ఆదాయం గడించానని, తనకు ప్రతి నెల జీతం లాగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఉద్యాన అధికారి ఆకుల వేణు రైతులకు కల్పిస్తున్న రాయితీ వివరాలను అలాగే అంతర పంటగా కోకో, వక్క, కూరగాయలు ద్వారా వస్తున్న అదనపు ఆదాయం గురించి వివరించారు. రైతులకు ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లించలని ఉద్యాన అధికారి ఆకుల వేణును కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో ఏనుకూరు తహసిల్దార్ శేషగిరిరావు, గోద్రెజ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..