
హైదరాబాద్, 02 జూలై (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన
సచివాలయంలో జరుగుతున్న తెలంగాణ తొలి 'ఈ-కేబినెట్' భేటీలో విద్యా రంగానికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అందరికీ ఉచితంగా అల్పాహారం (Breakfast), మధ్యాహ్న భోజనం (Mid-day Meals) అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం, కొన్నిచోట్ల సీఎం అల్పాహార పథకం అమలు అవుతోంది. అయితే, ఇకపై పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు రోజంతా విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి కూడా ఈ ఉచిత భోజన సదుపాయాన్ని విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. తాగాజ నిర్ణయంతో విద్యాసంస్థల్లో నాణ్యమైన సమయం గడపడానికి, టీచర్లు సకాలంలో అందుబాటులో ఉండటానికి మరింత వీలు కలుగుతుందని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ సిబ్బంది, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..