

న్యూఢిల్లీ [ఇండియా]:, 21 జూలై (హి.స.)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ పార్టీ వారంతపు వ్యూహాత్మక సమావేశం ‘మంగళ్ మిలన్’ పేరుతో మంగళవారం ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఉన్న జి.ఎం.సి బాలయోగి ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీఏ కూటమికి చెందిన ప్రముఖ మంత్రులు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ హాజరయ్యారు. కూటమిలోని అన్ని పక్షాల మధ్య ఐక్యతను చాటడం మరియు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సభలో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటయింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఒక ముఖ్యమైన అభినందన తీర్మానాన్ని ఆమోదించనున్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీని ఈ సమావేశంలో కూటమి నేతలు ఘనంగా సత్కరించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. అలాగే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన కొత్త బీజేపీ ఎంపీలకు (మాజీ ఆప్ ఎంపీలతో సహా) కూటమి తరపున అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ఎన్డీఏ తన సాంప్రదాయ పార్లమెంటరీ సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త సాంస్కృతిక మరియు సంస్థాగత గుర్తింపును ఇవ్వడం ఇదే తొలిసారి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi