
కర్నూలు, 25 జూలై (హి.స.)కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీ రంగనాథ స్వామి వారి భక్తులందరికీ, ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తిపారవశ్యంతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తుల రాకపోకలతో దేవస్థానం సందడిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV