
న్యూఢిల్లీ, 28 జూలై (హి.స.)
తమ ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ-పేపర్ లీక్ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనం అన్నారు. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ సందర్భంగా మాట్లాడిన జితేంద్ర సింగ్.. యూపీఏ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీకేజీ జరిగిందన్నారు. 2010లో యూపీలో బీఈడీ పేపర్ లీకేజీ, గతంలో తమిళనాడులో పీఎస్సీ పేపర్ లీకేజీ జరింగిందని గుర్తు చేశారు. ఎన్నో ఎంట్రన్స్, పరీక్షలు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని పేపర్ లీకేజీలు క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని అన్నారు.
లీకేజీలను అరికట్టేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయని లీకేజీలు నిరోదించేందుకు 1992, 2010లో కొన్ని ప్రయత్నాలు జరిగాయన్నారు. ఆ ప్రయత్నాలు ఎందుకు పూర్తి కాలేదో ఆనాటి పాలకులు సమాధానం చెప్పాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించామని, దోషులకు జైలు శిక్షను పదేళ్లకు పెంచినట్లు చెప్పారు. అలాగే లీకేజీ గ్యాంగ్ లకు జరిమానాను రూ. కోటి నుంచి రూ. 10 కోట్లకు పెంచామన్నారు. లీకేజీ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ బిల్లు ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. లీకేజీలు అరికట్టేందుకు నందన్ నీలేకని ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో శ్రమిస్తున్నట్టు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు