
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన యూట్యూబర్ రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. తాజాగా అతడి కేసును గన్నవరం కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు బదిలీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి నమోదైన ఉపా చట్టం తీవ్రత, ప్రత్యేక న్యాయ పరిమితులను పరిగణనలోకి తీసుకుని, కేసు రికార్డులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడలోని 2వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు, అలాగే ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు అధికారులు బదిలీ చేశారు. ఉపా చట్టం కిందికి వచ్చే కేసులకు ప్రత్యేక అధికార పరిధి కలిగిన న్యాయస్థానాల్లోనే విచారణ జరగాల్సి ఉండటంతో ఈ మార్పులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, నిందితుడి డిజిటల్ కంటెంట్, నిషేధిత సిద్ధాంతాల ప్రచారం, నెట్వర్క్లపై సమగ్రంగా విచారించాల్సి ఉందంటూ పోలీసులు కస్టడీ పిటిషన్ను దాఖలు చేయగా, విజయవాడ కోర్టులో న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, పోలీసు కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణతో పాటు తీర్పు వెల్లడించేందుకు తేదీని ఖరారు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi