
అమరావతి, 27 ఆగస్టు (హి.స.)
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మూలాలపై ఐటీ ఆరా తీస్తోంది. మనీ ట్రయల్ వివరాల కోసం హైదరాబాద్లో సిట్, ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావేశమయ్యారు. డొల్ల కంపెనీల ద్వారా భారీగా నగదు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే. దుబాయ్ సహా పలు దేశాలకు సొమ్మును తరలించినట్లుగా విచారణలో గుర్తించారు. ఈ క్రమంలో ఏ ఏ కంపెనీల ద్వారా సొత్తు మళ్లించారనే దానిపై ఐటీ ఆరా తీస్తోంది.
నిధులు ఎక్కడికి చేరాయనే అంశంపైనా ఐటీ వివరాలను సేకరించనుంది. విదేశాలకు, బినామీ సంస్థలకు సొమ్మును ఎలా తరలించారనే దానిపై దృష్టిసారించింది. నిందితులు, డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆదాయపు పన్నుశాఖ అధికారులు తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరించనున్నారు. సిట్, ఈడీ నుంచి సేకరించిన సమాచారంపై తదుపరి చర్యలకు ఐటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ