
అనంతపురం, 15 సెప్టెంబర్ (హి.స.)అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలోని అదానీ సిమెంట్ కర్మాగారంలో ఇవాళ (మంగళవారం) భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
కర్మాగారంలోని 440 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న మెకానిక్లు హాజీ వలి, బద్రీనాథ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు, సిబ్బంది అప్రమత్తమై బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుంది. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికి తీసేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం కారణమా? లేక నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV