
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన పై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు శాసనసభ ఎథిక్స్ కమిటీకి గడువును పొడిగిస్తూ తెలంగాణ శాసనసభ నేడు నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఏర్పాటైన ఎథిక్స్ కమిటీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించడానికి మరింత సమయం అవసరమని కమిటీ భావించింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాల వరకు కమిటీ కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించారు.
బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించేందుకు వచ్చే సమావేశాల వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరగా, సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..