
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
భారత్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థికపరమైన టారిఫ్లను పెంచేందుకు తమ చట్టసభల నుంచి అనుమతి పొందుతున్నారని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ విమర్శించారు. మన దేశానికి లాభం చేకూర్చే ఏ చర్యలకూ అమెరికా అంగీకరించడం లేదని, పైగా బెదిరింపులకు దిగుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన నారాయణ.. చౌకగా లభించే చమురుతో పాటు ఇతర వస్తువుల కొనుగోలుకు భారత్ ప్రయత్నిస్తే, మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా టారిఫ్లు పెంచుతామని ట్రంప్ భయపెడుతున్నారని, ఈ వేధింపులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగకూడదని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానానికే కట్టుబడి రాజకీయంగా దృఢంగా నిలబడాలని సూచించారు. భారత్, చైనా, రష్యాలు కలిసి ఉమ్మడిగా పనిచేస్తేనే ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని నారాయణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..