మైసూరు, 1 అక్టోబర్ (హి.స.)
మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన జంబూసవారికి రాచనగరి సిద్ధమవుతోంది.
రేపు గురువారం మధ్యాహ్నం జంబూసవారి వేడుకలు జరగనున్నాయి. వందలాది కళాబృందాలు, అశ్వదళం సాగుతుండగా గజరాజుల ఊరేగింపు జంబూసవారిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 750 కేజీల బంగారు అంబారీపై నాడదేవత చాముండేశ్వరిదేవిని ప్రతిష్టించి గజరాజుపై ఊరేగింపు చూసేందుకు లక్షలాదిమంది రానున్నారు. మైసూరు జిల్లా యంత్రాంగం వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం కూడా రిహార్సల్స్ జరిగాయి.
కాగా మైసూరు ప్యాలెస్ మీదుగా సాగే జంబూసవారి యాత్రలో పాల్గొనేవారికి ప్రత్యేకమైన పాస్లను మంజూరు చేశారు. గతంలో చోటు చేసుకున్న కొన్ని పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా వేలాదిమందితో పోలీసుబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
దసరా ఉత్సవాలు సెప్టెంబరు 22న ప్రారంభం కాగా అప్పటి నుంచే మైసూరుకు కొత్త శోభ వచ్చింది. ప్రతినిత్యం కళాబృందాల ప్రదర్శనలు, వస్తు ప్రదర్శనశాలతోపాటు వివిధ వేదికల ద్వారా సాంస్కృతిక, సాహిత్యగోష్టులు నిరంతరంగా సాగాయి.
నాట్య ప్రదర్శనలు కొనసాగాయి. వైమానిక ప్రదర్శనలు మైసూరు ప్రజలను అలరించాయి. ప్రతిరోజూ సాయంత్రం మైసూరు వీధులలో కిలోమీటర్ల ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ ప్రత్యేకంగా ఉంది. అందుకు అనుబంధంగా డ్రోన్ షో మరింత ఉత్సాహం నింపింది. ఆకాశంలో వివిధ దేవతల రూపాలతోపాటు పలు ప్రత్యేకమైన బొమ్మల వెలుగులు జిగేల్ మనిపించాయి. డ్రోన్షోలో భాగంగా 3వేల డ్రోన్లతో జాతీయజంతువు పులి నమూనాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు లభించింది.
కావేరి హారతి దక్షిణ పరంపర కావాలి: సుత్తూరు స్వామీజీ
ఉత్తరభారత్లో గంగా హారతి తరహాలోనే దక్షిణాదిన కావేరి హారతి నిరంతరం సాగాలని తద్వారా ఉత్తర, దక్షిణభారత్ల పరంపర సమ్మిళినం కానుందని సుత్తూరు వీరసింహాసన మఠాధిపతి డాక్టర్ శివరాత్రి దేశికేంద్రస్వామిజీ అభిప్రాయపడ్డారు. కావేరి హారతి కార్యక్రమంలో పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ డీసీఎం కలల ప్రాజెక్టు కావేరి హారతి విజయవంతమైందన్నారు. ఎడారిలాంటి ప్రాంతాన్ని కేఆర్ఎస్ సస్యశ్యామలంగా మార్చిందని, కావేరి హారతి ద్వారా ఆధ్యాత్మికత పెరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV