హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
డీపీడీపీ చట్టంలోని సమాచార హక్కు చట్టం(RTI)ని బలహీనపరిచే సెక్షన్ 44(3) సవరణలను పునః పరిశీలించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. RTI అమలుకు 20 ఏళ్లు పూర్తి కావడం సందర్భంగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన చారిత్రాత్మక చట్టాల ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. 'డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారి దూరదృష్టి నాయకత్వంలో RTI, MGNREGA, అటవీ హక్కుల చట్టం, విద్య హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలను అమలు చేసింది. ఇవి దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచాయి' అని అన్నారు. RTI చట్టం పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారి, సరుకుల పంపిణీ, పెన్షన్లు, బకాయిలు, స్కాలర్షిప్లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..