హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్
సిటీ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నేతలు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao).. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో గన్ కల్చర్ (Gun culture) పెరిగిపోయిందని, బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ప్రోత్సహిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) గన్ కల్చర్ తీసుకొచ్చిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అలాగే ఈ ప్రభుత్వంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ హోంమంత్రిగా ఉన్నప్పటికి హోంశాఖపై కనీసం సమీక్ష జరపడం లేదని, కాంగ్రెస్ నేతలు, మంత్రులు వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు