హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)
మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ నకిలీ కాల్తో కూడిన వీడియోను ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. (Cyber Crimes)
‘‘అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్త అవసరం. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయడం ద్వారా గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.inలో గానీ ఫిర్యాదు చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు