అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)
విశాఖ వన్ టౌన్: విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్ భవానీ శంకర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్ కార్యాలయాల నుంచి డీఆర్వో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీవో నాలుగు రోజుల క్రితం కలెక్టర్కు లేఖ రాశారు. మరోవైపు.. పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఆర్డీవోకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆర్డీవో, డీఆర్వోలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
హెచ్బీసీఎల్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ ఎస్.విద్యాసాగర్కు విశాఖ ఆర్డీవోగా బాధ్యతలు అప్పగించారు. డీఆర్వో బాధ్యతలను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర అశోక్లకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే ఆర్డీవో, డీఆర్వోలను రిలీవ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ