
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)
అమరావతి, ): మంద తుఫాన్ కారణంగా సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికీ రూ.3 వేలు చొప్పున ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహాయ, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తికీ రూ.1,000, ప్రతి కుటుంబానికీ గరిష్ఠంగా రూ.3,000 అందించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక సహాయ నిధులను డ్రా చేయడానికి కలెక్టర్లకు అనుమతి ఇస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం (చేనేత, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోలు), కిలో కందిపప్పు, చక్కెర, లీటర్ వంట నూనె (పామాయిల్), కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం ఉన్న 19 జిల్లాల్లో ముందస్తుగా ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలకు, తుఫాన్ వల్ల జీవనోపాధి దెబ్బతిన్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి కలెక్టర్లకు అనుమతిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ