
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా ప్రధాన రహదారులు(ఎండీఆర్), స్టేట్ హైవే(ఎస్హెచ్)లు కలిపి దాదాపు 5వేల కి.మీ. మేర రోడ్లు ధ్వంసమైనట్లు ఆర్అండ్బీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తుఫాన్, వరదల ప్రభావంతో రాష్ట్ర హైవేలు 1,272 కి.మీ., జిల్లా ప్రధాన రహదారులు 3,728 కిమీ మేర పాడయ్యాయని తెలిపింది. రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేసినా అవి ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదని, ఇందుకోసం తక్షణ మర్మతులు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. దీనికోసం రూ.272 కోట్ల ఖర్చు కానుందని సర్కారుకు నివేదించింది. చిన్నపాటి మరమ్మతులు, గుంతలు పూడ్చినా ఉపయోగంలోకి రానంతగా ధ్వంసమైన రహదారులను పునర్నిర్మించడానికి రూ.2,440 కోట్ల నిధులు కేటాయించాలని కోరింది. ఇలా మొత్తం రూ.2,712 కోట్లపైనే ఖర్చుకానుందని ఆర్అండ్బీ నివేదికల్లో పొందుపరిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ