
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కట్టబెట్టింది.
మరోవైపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై, అజర్కు మంత్రి పదవిపై తనకు సమాచారం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే. ఏకంగా కేబినెట్ సీనియర్ మంత్రి, ముఖ్యమైన ఐటీ, పరిశ్రమలు, శాసన సభవ్యవహారాల శాఖలు చూస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కూడా అజర్కు మంత్రి పదవి విషయం తెలియదట. అజారుద్దీన్ మంత్రి పదవి గురించి మీడియాలోనే చూశానని, తనకు సమాచారం లేదని ఓ మీడియా ప్రతినిధితో మంత్రి దుద్దిల్ల చెప్పారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగబోతున్నదో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ కు కనీస సమాచారం లేదని, ఆయన కంటే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దే స్పష్టమైన సమాచారం ఉన్నదని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అజారుద్దీన్ను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా?అని మీడియా ప్రతినిధులు బుధవారం మహేష్ కుమార్ గౌడ్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ క్యాబినెట్ విస్తరణకు సంబంధించిగానీ, అజారుద్దీను మంత్రి పదవి ఫైనల్ అయినట్టుగానీ తనకు సమాచారం లేదని పేర్కొన్నారు.
అజారుద్దీన్ మంత్రి పదవిపై టీవీల్లో వస్తున్న సమాచారమే తప్ప అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం లేదని స్పష్టంచేశారు. పైగా శుక్రవారం క్యాబినెట్ విస్తరణ ఏర్పాట్లపై కూడా సమాచారం లేదని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు