
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుడి, బడి, వీధి ఇలా ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. కొంత మంది అయితే భిక్షాటనను ఓ మాఫియా గా మార్చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఈ ('Begging Prevention Act') చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV