హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిగా స్పందిస్తూ.. ఆర్టీసీ సిటీ బస్సు చార్జీల పెంపుపై మండిపడ్డారు.
ఆయన తన ట్వీట్లో.. సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టికెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజధానివాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోందని తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..